మనిఆర్డర్

1971వ సంవత్సరం... కర్ణాటకలోని తుమకూరు నగరంలో ఉన్న ఒక పాఠశాల ఆఫీస్ గదిలో సురేష్ అనే బాలుడు ఒకింత ఆందోళనతో కూర్చుని ఉన్నాడు. అతను చదువులో ఎప్పుడూ ముందే ఉండేవాడు. పైచదువుల కోసం కాలేజీకి వెళ్లాలన్నది అతని చిరకాల వాంఛ. కానీ, అతని కలల ముందు ఒక పెద్ద సమస్య నిలిచింది. కాలేజీ ఫీజు కట్టే స్తోమత అతని కుటుంబానికి ఏమాత్రం లేదు.

తండ్రి కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసేవారు; తల్లి రవికలు కుడుతూ సంసారాన్ని నెట్టుకొచ్చేది. వారి పరిస్థితికి ఉన్నత చదువులు అనేవి తమ స్థాయికి మించిన కలలా తోచేవి.

సరిగ్గా అప్పుడే ఊహించని ఒక అద్భుతం జరిగింది. హెడ్‌మాస్టర్ అతని చేతికి ఒక మనీ ఆర్డర్‌ను అందించారు. అందులో ఉన్న డబ్బు అతని మొదటి సంవత్సరం కాలేజీ ఫీజుకు సరిపడా ఉంది.

పంపినవారి పేరు లేదు.
తిరిగి పంపాల్సిన చిరునామా లేదు.
అసలు ఆ సహాయం ఎవరిచ్చారో తెలియజేసే చిన్న ఆధారం కూడా లేదు.
దానితో పాటు ఒక చిన్న చీటీ మాత్రమే ఉంది:
"ముందుకు సాగే అర్హత ఉన్న ఒక విద్యార్థి కోసం... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో."
సురేష్‌కు అది దైవకృపలా అనిపించింది.

ఆ సహాయం అతని జీవిత గమనాన్నే మార్చేసింది. అతను పట్టుదలతో కాలేజీ పూర్తి చేశాడు, కామర్స్ చదివాడు, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అయ్యాడు, సమాజంలో ఎంతో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించాడు. అయితే, తనపై నమ్మకం ఉంచిన ఆ అజ్ఞాత వ్యక్తిని మాత్రం జీవితంలో ఎన్నడూ మరువలేదు.

ఏళ్లు గడిచాయి. జీవితం ముందుకు సాగింది. కానీ ఆ జ్ఞాపకం మాత్రం అతని గుండెల్లో సజీవంగానే నిలిచింది. ఆ తర్వాత 1993లో, సురేష్ నిశ్శబ్దంగా తాను చదివిన అదే పాఠశాలకు తిరిగి వచ్చాడు. అక్కడ ప్రధానోపాధ్యాయులను కలిసి ఒక చిన్న విన్నపం చేశాడు.

ప్రతి సంవత్సరం, కాలేజీ ఫీజు కట్టలేని ప్రతిభావంతుడైన ఒక పేద విద్యార్థిని ఎంపిక చేయాలని కోరాడు. ఆ ఖర్చులన్నీ తానే భరిస్తానని చెప్పాడు. కానీ ఆ సహాయం ఎవరు చేస్తున్నారో ఆ విద్యార్థికి ఎప్పటికీ తెలియకూడదన్నది అతని ఏకైక షరతు. పాఠశాల యాజమాన్యం అందుకు అంగీకరించింది.

ఒక సంవత్సరం కాస్తా రెండేళ్లయింది.
రెండేళ్లు పదేళ్లయ్యాయి.
పదేళ్లు కాస్తా ఏకంగా ఇరవై ఏడేళ్ల ప్రయాణంగా మారింది.
వరుసగా 27 సంవత్సరాల పాటు ఆ బడికి క్రమం తప్పకుండా ఒక మనీ ఆర్డర్ వస్తూనే ఉంది. ఆ నిస్వార్థ దాతృత్వం వల్ల 27 మంది పేద విద్యార్థులు కాలేజీ గడప తొక్కగలిగారు. వారిలో కొందరు ఉపాధ్యాయులయ్యారు. కొందరు ఇంజనీర్లయ్యారు. కొందరు నర్సులుగా నిలిచారు. మరికొందరు సమాజ సేవకులుగా మారారు.

ఒకప్పుడు సురేష్‌ను ఎవరు ఆదుకున్నారో అతనికి ఎలా తెలియదో... అలాగే తమ జీవితాలకు వెలుగునిచ్చిన ఆ మనిషి ఎవరో ఈ 27 మందిలో చాలామందికి తెలియదు. చివరకు ఎప్పటికో పాఠశాల యాజమాన్యానికి ఆ నిశ్శబ్ద దాత సురేషేఅన్న అసలు నిజం తెలిసింది.

ఇంతకాలం ఈ నిస్వార్థ సేవను ఎందుకు కొనసాగించారని అడిగినప్పుడు, సురేష్ ఎంతో హృద్యమైన సమాధానమిచ్చాడు:
"ఎవరో ముఖం తెలియని వ్యక్తి నాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. నేను కేవలం దాన్ని మరొకరికి అందించానంతే." 2021లో సురేష్ కన్నుమూశారు.
కానీ ఆ వెలుగుల ప్రయాణం మాత్రం ఆగిపోలేదు.
ఈ రోజుకీ ఆయన పిల్లలు అదే ఆనవాయితీని కొనసాగిస్తూనే ఉన్నారు.
బహుశా ఈ ఏడాదే, తుమకూరులోని ఎవరో ఒక నిరుపేద విద్యార్థి తన జీవిత దిశను మార్చేసే ఒక కవరును అందుకోవచ్చు.
ప్రశంసలను, అవార్డులను, గుర్తింపును ఆశించకుండా చేసే సాయమే నిజమైన మానవత్వం.
అలాంటి నిస్వార్థ కరుణ ఏ ఆర్భాటం లేకుండా ఒక హృదయం నుండి మరో హృదయానికి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.
సేకరణ : Social Media

Comments

Popular Posts

శ్రాద్ధకర్మల ప్రాశస్త్యం

నిశ్శబ్ద సేవ

తెలుగు పద్యరత్నాలు