*ఒక అద్భుతమైన కథ*.
రాత్రి చీకటి పడుతోంది. తాళం వేసిఉన్న ఇనుప ద్వారం బయట నుండి ఒక పిలుపు. ఎవరా అని వచ్చి చూశాను. గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు. చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి ఉన్నారు. అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ!" అని అడిగారు. "అవును నేనే ఆనంద్. ఇదే చిరునామా. మీరూ ..." అని నసిగాను. అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో తడుపుకుంటూ "బాబూ! నేను మీ నాన్నగారి మిత్రుడిని. మీ ఊరినుండే వస్తున్నాను. నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు.
అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను. అందులో "ప్రియమైన ఆనంద్! నీకు నా ఆశీర్వాదములు. ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు. పేరు రామయ్య. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది. ఆక్సిడెంట్ జరిగిన తరువాత పోలీస్ వారి విచారణలు, ట్రావెల్స్ వారు ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్ని సేకరించి నీకు పంపాను. డబ్బులు Head Office లో తీసుకోమన్నారు. ఆయనకు హైదరాబాద్ కొత్త. ఏమి తెలియదు. నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ
మీ నాన్న" అని ఉంది.
నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్యగారు. ఒక్క నిమిషం అలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను. మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి "ఏమైనా తిన్నారా" అని అడిగాను. "లేదు బాబూ. ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నాన"ని చెప్పారు.
నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను. "మీరు తింటూ ఉండండి" అని చెప్పి, ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్ లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను. నేను వచ్చి చూసే సరికి ఆయన దోశలు ఆరగించి, చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని కూర్చున్నారు. నన్ను చూసి ఆ పేపర్ లు నా చేతిలో పెట్టారు. అందులో ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది. కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు. సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.
"ఇతకు నా ఒక్కగానొక్క కొడుకు. అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు. ఇతడు మాత్రమే మాకు మిగిలాడు. పేరు మహేష్. కష్టపడి చదివించాను. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు. మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు. ఆ రోజు రోడ్ దాటుతుండగా ఆక్సిడెంట్ జరిగింది. అక్కడికక్కడే చనిపోయాడు. నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాము. కానీ రోజు రోజుకీ నాలో శక్తి తగ్గిపోతోంది. నా భార్య ఆరోగ్యం బాగా లేదు. మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను. నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు" అని ముగించారాయన.
"సరే పొద్దు పోయింది, పడుకోండి" అని చెప్పి నేను కూడా నిదురపోయాడు
పొద్దున లేచి స్నానాదికాలు ముగించుకుని, కాఫీ తాగి ఇద్దరం బయల్దేరాము. దారిలో టిఫిన్ ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్ల లోని అడ్రెస్ ప్రకారాం ఆ ఆఫీస్ కు చేరుకున్నాము. "ఆనంద్! ఇక నేను చూసుకుంటాను. నువ్వు ఆఫీస్ వెళ్ళు బాబు" అన్నారాయన. "పర్లేదండి. నేను లీవ్ పెట్టాను" అన్నాను. దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను. చాలా థాంక్స్ బాబూ! నేను ఊరికి బయల్దేరుతాను. మా ఆవిడ ఒక్కతే ఉంటుంది ఇంట్లో" అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు. "రండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తా" అని చెప్పి, టిక్కెట్ తీసి ఇచ్చి, ఇప్పుడే వస్తానని వెళ్లి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య చేతిలో పెట్టాను.
ఆయన సంతోషంగా "ఆనంద్ బాబూ! నాకోసం సెలవు పెట్టుకొని, చాలా సాయం చేశావు. ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి. కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు.
అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని "నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ ని కాదండీ.
నా పేరు కూడా అరవింద్. మీరు చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు. ఆ ఆనంద్ ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట మరో 2 km ప్రయాణం చేయాలి. మీరేమో అలసిపోయి ఉన్నారు. అందుకే నేను నిజం చెప్పలేదు. మీరు తెచ్చిన లెటర్ లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను. ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట. ఆయన భార్య చెప్పారు. మీ మిత్రుడికి విషయం చెప్పాను. అయన చాల బాధ పడ్డారు. నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు. మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది. కానీ ఏదో నాకు చేతనైన సహాయం చెయ్యాలనిపించింది. నాకు ఆ తృప్తి చాలండి" అన్నాను. బస్సు కదలడం తో ఒక్కసారి రామయ్యగారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. "నువ్వు బాగుండాలి బాబు" అని ఆశీర్వదించారు. ఆ మాటే చాలనుకున్నాను నేను. పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖం లో మా నాన్నగారు కనిపించారు.
ఆకాశంలోకి చూశాను. అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మానాన్న. "నాన్నా! నా అభివృద్ధి చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు! ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా? మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్నా! మీకు సంతోషమేనా నాన్నా!" అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను.
"సాయం చెయ్యడానికి మనసు ఉంటే చాలు. మిగిలినవన్నీ దానికి తోడుగా నిలబడతాయి"
నేమాని సూర్యనారాయణ
విశాఖపట్నం
27.03.2019
👈Click to Share in Whatsapp
తద్దినాలు పెట్టడము అవసరమా తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని క...
🌸పరోపకారం గురించి ఒక చిన్న కథ🌸 అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు ... ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా? అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ. శివుడు నవ్వి, దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు. మొదట ఇదేదో అద్భుతమైన కల అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ...