జయమంత్రం

జయమంత్రం

జయమంత్రం అంటే ఏమిటి. దాని అర్థం ఏమిటి? దాన్ని ఎవరు పఠించాలి?💐

సీతాన్వేషణకై లంకకు వెళ్లిన హనుమంతుని ఎనభైవేల మంది రాక్షసులు ఒక్కసారిగా చుట్టుముట్టినప్పుడు హనుమ ఉద్ఘోషించినదే 'జయమంత్రం'. ఇది శ్రీవాల్మీకి రామాయణం సుందరకాండలో 42వ సర్గలో ఉంది. ఈ కింది నాలుగు శ్లోకాలనే జయమంత్రం అంటారు.

"జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః
నవరావణ సహస్రంమే యుద్ధే ప్రతిఫలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అర్దయిత్వాపురీం లంకాం అభివాద్యచమైథిలీం
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరాక్షసాం"
ఈ శ్లోకాల అర్థం
అధిక బలుడగు రాముడు, మహాబలుడగు లక్ష్మణుడు అతిశయంతో వర్ధిల్లుచున్నారు. రామునిచే రక్షింపబడిన సుగ్రీవుడు జయము కలిగి ఒప్పుచున్నాడు. నేను కోసలేంద్రుడగు రాముని దాసుడను. శత్రుసైన్యమును చంపువాడను. వాయుపుత్రుడను, వేయి మంది రావణులు వచ్చినా యుద్ధంలో నన్నెదిరించి నిలువలేరు. శిలలతో వృక్షాలతో మాత్రమే నేను కొట్టెదను.

లంకాపురిని మర్దించి మైథిలికి నమస్కరించి, సాధింపవలసిన కార్యాన్ని సాధించి రాక్షసులందరు చూస్తుండగానే వెళ్లెదను. ఇది హనుమ రాక్షసులపై విజయానికి ఉపయోగించిన జయమంత్రం. ఈ మంత్రాన్ని అనుసంధిస్తే మనకు కూడా విరోధులు తొలగి విజయం చేకూరుతుంది. ఈ జయమంత్రంలోనే మొదటిసారిగా హనుమ తనను దాసునిగా పేర్కొన్నాడు. సీతమ్మను చూసిన తరువాతే హనుమకు స్వస్వరూపం తెలిసింది. ఆత్మలకు సహజ స్వరూపం భగవద్దాస్యమే.

రామాయణ పారాయణం చేసేటప్పుడు ఈ జయమంత్రాన్నే సంపుటీకరణ శ్లోకాలుగా అనుసంధిస్తారు. అంటే పారాయణం ముందు వెనుక ఈ నాలుగు శ్లోకాలు చదివితే 'సంపుటీకరణం' చేసిన ఫలం ఉంటుంది.
Share on WhatsApp
సేకరణ : Social Media

Comments

Popular Posts

తద్దినం ప్రాముఖ్యత

పరోపకారం గురించి ఒక చిన్న కథ

తెలుగు పద్యరత్నాలు